శుభ సమయాల్లో చెడు శకునం రాహుల్.. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా

by Dishafeatures2 |
శుభ సమయాల్లో చెడు శకునం రాహుల్.. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. దేశంలో చారిత్రాత్మక క్షణాలు వచ్చినపుడల్లా రాహుల్ గుండెలు బాదుకుంటున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. అభివృద్ధిని ఓర్వలేడని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడాన్ని రాహుల్ వ్యతిరేకించారు. రాష్ట్రపతి ప్రారంభించాలని.. ప్రధాని కాదని ఆయన అన్న విషయం విదితమే. ‘ఇలా ఎందుకు జరుగుతోంది? దేశం పురోగమిస్తున్నప్పుడు శుభ ముహూర్తాల్లో ఆయన చెడు శకునంలా ముందుకు వస్తాడు. పార్లమెంట్ భవనం ఎల్లప్పుడు ప్రజాస్వామ్య దేవాలయం’ అని భాటియా అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా బీజేపీపై ఆరోపణలు చేశారు.

ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రపతిని, మాజీ రాష్ట్రపతిని ఆహ్మానించకుండా పదే పదే వారి ఔచిత్యాన్ని అగౌరవపరిచిందన్నారు. ‘ఎన్నికల కోసమే మోడీ ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల నుంచి భారత రాష్ట్రపతిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది’ అని ఖర్గే వరుస ట్వీట్లు చేశారు. కొత్త పార్లమెంట్ భవనం కావాలని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ స్పీకర్ మీరా కుమార్ మాటలను ఈ సందర్భంగా బీజేపీ నేత గుర్తు చేశారు. కాంగ్రెస్ పనికిమాలినదని చెప్పిన భాటియా.. ప్రధాని మోడీ తన సొంత కలను నిజం చేసుకోవడం కూడా వారికి సమస్యగా మారిందన్నారు. కొత్త పార్లమెంట్ లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది, రాజ్యసభ ఛాంబర్‌లో 300 మంది కూర్చునే వీలున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.


Next Story

Most Viewed